

భారత మహిళల క్రికెట్లో యువ పేసర్ క్రాంతి గౌడ్ చరిత్ర సృష్టించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించింది. ఈ ప్రదర్శనతో లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో చోటు దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్గా నిలిచిన క్రాంతి, తన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఈ రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా, టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా పేసర్గా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
ట్యామీ బీమాంట్తో ప్రారంభమైన క్రాంతి వికెట్ల వేట.. మైయా బౌచియర్, అలీస్ క్యాప్సీ, కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్, లారెన్ బెల్ వికెట్లతో కొనసాగింది. ముఖ్యంగా అలీస్ క్యాప్సీ ఆఫ్ స్టంప్ను ఎగరగొట్టిన బంతి మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రెండో రోజు 21/1 స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 170 పరుగులకే ఆలౌట్ అయింది. అమీ జోన్స్ (52), నాట్ సీవర్-బ్రంట్ (44) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు తీయగా, సయాలి సత్ఘరే, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ చేసిన 285 పరుగులతో కలిపి జట్టు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!