

అల్ట్రా ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్ పేరుతో కొత్త తరహా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లండన్లో జరగనున్న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ డివైస్ను పరిచయం చేసే అవకాశం ఉంది. సంప్రదాయ బుక్స్టైల్ ఫోల్డబుల్స్తో పోలిస్తే వైడ్ డిజైన్లో వచ్చే ఈ ఫోన్ వీడియోలు చూడడం, వెబ్ బ్రౌజింగ్, ఈ-బుక్స్ చదవడం, మల్టీటాస్కింగ్ వంటి పనులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో ఈ కొత్త డిజైన్ను ప్రజాదరణ పొందేలా చేయాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఏఐ డేటా సెంటర్ల పెరుగుదలతో మెమరీ చిప్ ధరలు భారీగా పెరిగినా, స్మార్ట్ఫోన్ మార్కెట్ మందగించినా శాంసంగ్ తన ప్రీమియం ఫోల్డబుల్ వ్యూహాన్ని కొనసాగిస్తోంది. అధిక ధరల ఫోల్డబుల్ ఫోన్లు కంపెనీకి మెరుగైన ఆదాయాన్ని అందిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్తో పాటు కొత్త స్మార్ట్వాచ్లు, స్మార్ట్ గ్లాసెస్ను కూడా శాంసంగ్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆపిల్, హువావే వంటి సంస్థలతో పోటీలో ముందంజలో నిలవడానికి ఈ కొత్త ఫోల్డబుల్ డిజైన్ కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!