

పౌరాణిక కథనం ప్రకారం.. ఒకసారి లోకసంచారం చేస్తున్న నారద మహర్షికి వింధ్య పర్వతం కనిపించింది. దాని గొప్పతనాన్ని ప్రశంసించిన నారదుడు.. ఎత్తు విషయంలో మాత్రం మేరుపర్వతంతో వింధ్య తులతూగలేదని అన్నాడు. ఆ మాటలు వింధ్య పర్వతం గర్వాన్ని రెచ్చగొట్టాయి. మేరుపర్వతాన్ని మించాలనే ఉద్దేశంతో అది క్రమంగా ఎత్తు పెంచుకుంటూ పోయింది. చివరకు దాని ఎత్తు కారణంగా దక్షిణ దిక్కుకు సూర్యకాంతి అందకుండా చీకట్లు అలుముకున్నాయి. అక్కడి రుషులు యజ్ఞయాగాదులు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యకు పరిష్కారం చూపాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా.. వింధ్య పర్వతానికి గురువు అగస్త్య మహర్షి అని, కాశీలో నివసిస్తున్న ఆయనను ఆశ్రయించాలని బ్రహ్మ సూచించాడు.
బ్రహ్మ సూచన మేరకు రుషులు కాశీకి వెళ్లి అగస్త్య మహర్షిని కలిసి తమ సమస్యను వివరించారు. రుషుల బాధను విన్న అగస్త్యుడు వెంటనే దక్షిణ దిక్కుకు బయల్దేరాడు. తన గురువు వస్తున్నాడని గుర్తించిన వింధ్య పర్వతం వినయంగా శిరస్సు వంచి నమస్కరించింది. అగస్త్యుడు దానిని ఆశీర్వదించి.. తాను దక్షిణ దిక్కుకు వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు ఇలాగే తలవంచి ఉండాలని ఆదేశించాడు. గురువు ఆజ్ఞను వింధ్య సంతోషంగా అంగీకరించింది. అయితే దక్షిణానికి వెళ్లిన అగస్త్యుడు తిరిగి ఉత్తర దిక్కుకు రాలేదని పురాణ కథనం చెబుతోంది. దీంతో వింధ్య పర్వతం తలవంచిన స్థితిలోనే ఉండిపోయింది. దక్షిణ దిక్కుకు సూర్యకాంతి మళ్లీ అందడంతో రుషుల సమస్య తీరింది. శిష్యుడు ఎంత గొప్పవాడైనా గురువు ముందు వినయంతో తలవంచాలనే గొప్ప సందేశాన్ని ఈ పురాణ గాథ అందిస్తుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!