

హిందూ పురాణాల్లో ప్రసిద్ధి చెందిన ఒక కథ ప్రకారం.. ఒకప్పుడు భయంకరమైన క్షామం ఏర్పడింది. ఎక్కడా చుక్క నీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఆశాకిరణంగా నిలిచింది. మహర్షి ప్రతిరోజూ ఉదయం పిడికెడు ధాన్యాన్ని చల్లి, తపస్సులో కూర్చునేవారు. మధ్యాహ్న భోజన సమయానికి ఆ విత్తనాలు అద్భుతంగా మొలకెత్తి, ఆశ్రమవాసులందరికీ సరిపడా ధాన్యాన్ని అందించేవి. ఈ విషయం ఇతర రుషులకు తెలియడంతో, గౌతముడిని ఇబ్బందులకు గురిచేస్తే ఆయన శివభక్తి కారణంగా గంగను శివుని జటాజూటం నుంచి భూమిపైకి తీసుకురాగలడని వారు భావించారు.
అందులో భాగంగా రుషులు ఒక మాయా గోవును సృష్టించి, గౌతముడు సాగు చేసిన పంటలోకి పంపారు. పంటను నాశనం చేస్తున్న గోవును గమనించిన గౌతముడు చేతిలోని దర్భను దాని వైపు విసిరారు. దీంతో ఆ గోవు మరణించింది. వెంటనే రుషులు గోహత్య మహాపాపమని, ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే పరమశివుని శిరస్సు నుంచి గంగను భూమిపైకి తీసుకురావాలని గౌతముడికి సూచించారు. దీంతో గౌతమ మహర్షి ఘోర తపస్సు చేసి పరమశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన భక్తికి మెచ్చిన శివుడు గంగను భూమిపైకి ప్రవహింపజేశాడు. గౌతమ మహర్షి కారణంగా భూమిపైకి వచ్చిన ఆ పవిత్ర నది గౌతమీ లేదా గౌతమీ గంగగా ప్రసిద్ధి చెందింది. సంప్రదాయంగా ఇదే నది గోదావరిగా గుర్తించబడుతుంది. గౌతమ మహర్షి తపోబలం, శివభక్తి, సంకల్పశక్తిని చాటిచెప్పే గొప్ప పురాణ గాథగా ఇది నిలిచిపోయింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!