

అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి భారీ పెట్టుబడులను ఆకర్షించే కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించామని, 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.
పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని, అమెజాన్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, కాలుష్య నియంత్రణ, రైతులకు తగిన నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!