

ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని యువజన సేవలు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. విజయనగరంలో రూ.6 కోట్లతో స్టేడియం, ఇండోర్ క్రీడా హాల్ నిర్మించగా, తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో ఇండోర్ క్రీడా సముదాయాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన 399 మంది క్రీడాకారులకు రూ.14.58 కోట్ల ప్రోత్సాహకాలు అందించామని, 618 మంది క్రీడాకారులకు రూ.7.72 కోట్ల నగదు బహుమతులు ఇచ్చామని మంత్రి చెప్పారు. 2024-25లో 1,226 మంది, 2025-26లో 615 మంది క్రీడాకారులు క్రీడా కోటా ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2026 నాటికి 1,393 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 49 వేల మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీలో 382 పోస్టులను క్రీడాకారులకు కేటాయించామని, అర్హత ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!