

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు వేగం పెంచింది. ఈ ప్రణాళికను రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన అంతర్జాతీయ సంస్థకు అప్పగించింది. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడిదారులకు అనువైన విధంగా వివిధ ప్రత్యేక జోన్లతో నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించగా, మాస్టర్ ప్లాన్ను డిసెంబరులో జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2026’లో విడుదల చేయాలని నిర్ణయించింది.
ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబరులోగా యూనివర్సిటీని ప్రారంభించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండున్నరేళ్లలో 200కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు రావడంతో తెలంగాణ దేశంలోనే జీసీసీలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జీసీసీ హబ్తో పాటు లైఫ్ సైన్సెస్ హబ్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. నాగార్జునసాగర్ జాతీయ రహదారి నుంచి ప్రత్యేక రహదారి నిర్మాణం కొనసాగుతుండగా, త్వరలోనే పలు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!