

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నైజాం ప్రాంతంలో టికెట్ ధరలు పెరగనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాని ఇటీవల చేసిన సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాల వీడియోలతో.. వీటికి సినిమా టికెట్ ధరల పెంపు ప్రక్రియకు ఏమైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. టికెట్ ధరల పెంపునకు అనుమతులు కోరే సమయంలో ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం కూడా ఈ విషయంలో ముందుగానే అవసరమైన ప్రక్రియను ప్రారంభించిందనే ప్రచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
తాజాగా నాని నకిలీ పెట్టుబడి దరఖాస్తులను నమ్మి డబ్బులు కోల్పోవద్దంటూ సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే “మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి” అంటూ మరో వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ ఫోర్స్ 1908కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే నైజాం ప్రాంతంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1,000 వరకు ఉండొచ్చంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇంత భారీగా ధరలు పెంచే ఆలోచన లేదని, ప్రేక్షకులపై అధిక భారం పడకుండా మధ్యస్థ స్థాయిలోనే ధరలు పెంచే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అధికారిక టికెట్ ధరలు, ప్రభుత్వ అనుమతులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!