

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ భీమా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అచ్చంపేటలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అందక పలువురు విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ భీమా అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అచ్చంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!