

హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి గురువారం, ఆగస్టు 13న సాయంత్రం కూకట్పల్లి నియోజకవర్గంలో సీఎం స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం అధికారులతో గృహ నిర్మాణ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.
కూకట్పల్లిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించగా, ఈ నిర్మాణానికి రూ.43.20 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం ఇప్పటివరకు సుమారు 90 ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 8 వేల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందిరమ్మ టవర్స్ కోసం జూలై 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 50 వేల దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!