

తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాలపై అధిష్టానం కఠిన చర్యల దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిని పదవుల నుంచి తప్పించే అవకాశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ యంత్రాంగానికి స్పష్టమైన సందేశం పంపాలనే ఉద్దేశంతో అధిష్టానం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కొండా సురేఖపై కఠిన చర్యలకు బదులుగా శాఖ మార్పుకే పరిమితం కావాలని కొందరు పార్టీ ముఖ్యులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా సమావేశమై సురేఖ అంశంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం.
ప్రభుత్వ ప్రతిష్ట, పనితీరుపై ప్రభావం పడకుండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలి, హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను సమ్మతమేనని ఆయన తెలిపినట్లు సమాచారం. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్తో సమావేశమై తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ చేరుకున్న కొండా సురేఖ కూడా వేణుగోపాల్ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ నివేదిక, సీఎం, పీసీసీ చీఫ్, ఇన్చార్జ్ అభిప్రాయాలు, సురేఖ వివరణ ఆధారంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి సమగ్ర నివేదిక అందించనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!