

హిమాలయ ప్రాంతంలో నేపాల్-టిబెట్ సరిహద్దును కుదిపేసిన భీకర వరదలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటేకోషి నది ఉప్పొంగడంతో నీరు, బురద, మంచు, రాళ్లు భారీగా దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. దీంతో ఇళ్లు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమని భావించారు. అయితే అమెరికా జియాలాజికల్ సర్వే (USGS) తాజా విశ్లేషణలో కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రకంపనలకు కారణం సాధారణ భూకంపం కాదని, హిమనీ పతనం, దాని అనంతరం సంభవించిన మంచు-రాళ్ల ప్రవాహమే కారణమని స్పష్టం చేసింది.
తొలుత ఈ ఘటనను 4.4 తీవ్రతతో కూడిన భూకంపంగా గుర్తించినప్పటికీ, సీస్మిక్ తరంగాలు, శాటిలైట్ చిత్రాలను మరింతగా విశ్లేషించిన తర్వాత USGS తన అంచనాను సవరించింది. ఇదే సమయంలో నేపాల్ అధికారులు కూడా లిండే నదిలో మంచు చరియలు, రాళ్లు పడటంతో నదీ ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడి, అనంతరం భారీగా నీరు, మట్టి దిగువకు దూసుకొచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ జలప్రళయంలో నేపాల్లో కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గల్లంతయ్యారు. టిబెట్ ప్రాంతంలోనూ ప్రాణనష్టం, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉంది. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!