

పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరం వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, ఏ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు గోదావరిలో నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.
కుటుంబం ప్రయాణించిన కారులో లభించిన మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. ఫోన్లలో డిలీట్ చేసినట్లు గుర్తించిన వాట్సప్ సందేశాలతో పాటు ఇతర సమాచారాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్కు సంబంధించిన కాల్ డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. నూకరాజు కుటుంబాన్ని వేధించినట్లు ఖాన్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!