

చిత్తూరు జిల్లాలో పోలీసుల నిఘా ఉన్నప్పటికీ అక్రమ జూద కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూద స్థావరాల నిర్వాహకులు తమ వద్దకు వచ్చే వారికి భరోసా కల్పిస్తూ, దాడులు జరిగినా వాహనాలు, నగదు, ఇతర ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానికులతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా జూదరులు భారీ సంఖ్యలో చిత్తూరు పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. గంగాధరనెల్లూరు, బంగారుపాళ్యం, యాదమరి, తవణంపల్లె తదితర ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జూద నిర్వాహకులు స్థానికులకు అనుమానం రాకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, క్యాష్లెస్ లావాదేవీలు వంటి పద్ధతులను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొంతమంది జూదరులు స్థానిక ఫైనాన్సియర్ల నుంచి రోజువారీ రుణాలు తీసుకుని ఆటలో పాల్గొంటున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, రోజువారీగా జూదం నిర్వహిస్తున్నట్లు తమకు నిర్ధారిత సమాచారం లేదని, ఫిర్యాదులు లేదా విశ్వసనీయ సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!