

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించారు. రాష్ట్రాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
పారిశ్రామిక కారిడార్లు, ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక తయారీ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. సింగిల్ విండో విధానం ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. వేమో స్వయంచాలక వాహన సాంకేతికతపై అధ్యయనం చేసి, హైదరాబాద్లో ప్రయోగాత్మక అమలుపై ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!