

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో భావోద్వేగానికి గురయ్యారు. తిహాడ్ జైలుకు పంపడానికి తాను ఏం తప్పు చేశానని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగేళ్ల పాటు ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొన్నప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ కోసమే తనను జైలుకు పంపారని అప్పటి పెద్ద నాయకులు చెప్పారని, కష్టాల్లో ఉన్న ఆడబిడ్డకు అండగా నిలవాల్సిన సమయంలో తనను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత గడ్డపై మాట్లాడుతున్నందున భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నానని, అయితే తాను పిరికిదాన్ని కాదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మౌనంగా ఉందని ఆరోపించారు. పలువురు ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఆస్తులు, అక్రమాల ఆరోపణలు చేస్తూ వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బోధన్ చక్కెర కర్మాగారం, మాధవనగర్ రైల్వే వంతెన వంటి అంశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!