

వ్యవసాయంతోనే భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు స్థిరంగా నిలదొక్కుకునేలా ఆధునిక, సుస్థిర సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలలో రూ.10 కోట్లతో నిర్మించనున్న హార్టికల్చర్ రీసెర్చ్ కాంప్లెక్స్కు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించి, వివిధ కూరగాయల ప్రదర్శనను తిలకించారు.
ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనల ఫలితాలు, ఆధునిక సాంకేతికత రైతులకు చేరాలని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు అందించాలని మంత్రి అన్నారు. తెలంగాణ ఆయిల్పామ్ సాగులో ముందంజలో ఉందని, మరో రెండు, మూడు సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగాన్ని తగ్గించి సుస్థిర సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు స్థానికంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే యువత వారాంతాల్లో వ్యవసాయం వైపు ఆసక్తి చూపడం మంచి పరిణామమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!