

తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియంపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం సరికాదని కొండ సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు కూడా ఫిర్యాదు చేసిన కొండ సురేఖ, ఇప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సచిన్ సావంత్, కడియం శ్రీహరికి సంబంధించిన అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు, కొండ సురేఖ చేసిన ఆరోపణలపై తన వివరణను ఇవ్వడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సాయంత్రం సచిన్ సావంత్ను కలవనున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!