

ముంబైలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ‘భులేశ్వర్చా రాజా’ 22 అడుగుల గణపతి విగ్రహం ఆగమన ఊరేగింపులో ఒక్కసారిగా కూలిపోయింది. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బైకుల్లా నుంచి భులేశ్వర్కు విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విగ్రహం కూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను భులేశ్వర్చా రాజా గణేశ్ మండల్ అధ్యక్షుడు సంకేత్ నెవ్షే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30)గా గుర్తించారు. గాయపడిన వైభవ్ ఘెనంద్, పవన్ చౌరాసియా, లావణ్య గణేర్, దివ్య గణేర్, కునాల్ కాశిద్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, బీఎంసీ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విగ్రహం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన వెల్డింగ్ సపోర్ట్ విరిగిపోవడంతో అది ముందుకు పడిపోయినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!