

కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం కలెక్టర్, ఎస్పీ జోక్యంతో సద్దుమణిగింది. మొబైల్ ఫోన్ మిస్సైన అంశం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు, తెలుగు విద్యార్థినుల మధ్య వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. దీంతో కళాశాల, హాస్టల్ వద్ద కొంతకాలం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తమ మొబైల్ ఫోన్ మిస్సైన ఘటనపై చేసిన ఫిర్యాదును కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు ఆరోపించారు. స్థానిక విద్యార్థినులకు యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ నిరసనకు దిగారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా అధికారులు హాస్టల్కు చేరుకుని ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
వివాదం మరింత ముదరకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొత్తం 31 మంది విద్యార్థినులను వారి సమ్మతితో మరో హాస్టల్కు తరలించారు. విద్యార్థినుల భద్రత, ప్రశాంత వాతావరణం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్తత క్రమంగా తగ్గింది. ముఖ్యంగా మణిపూర్కు చెందిన విద్యార్థినులు తమ సమస్యలపై వెంటనే స్పందించిన కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!