

పల్నాడు జిల్లా విజయపురి సౌత్ సమీపంలోని కృష్ణానదిలో ఉన్న నాగార్జునకొండ దేశంలోని అత్యంత ప్రముఖ బౌద్ధ వారసత్వ క్షేత్రాలలో ఒకటి. 1954 నుంచి 1960 మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించిన తవ్వకాలలో 130కు పైగా ప్రాచీన నివాస స్థలాలు, 70కు పైగా నిర్మాణ అవశేషాలు, బుద్ధుడు మరియు ఆయన శిష్యులకు చెందిన ధాతుకరండకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రక అవశేషాలను జాగ్రత్తగా తరలించి నాగార్జునకొండపై యథాతథంగా పునర్నిర్మించగా, మిగిలిన పురావస్తువుల సంరక్షణ కోసం విశాలమైన మ్యూజియంను ఏర్పాటు చేశారు.
అయితే 1966లో నిర్మించిన మౌలిక సదుపాయాల తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం విజయపురి సౌత్ నుంచి నాగార్జునకొండ చేరుకోవాలంటే కృష్ణానదిలో సుమారు 14 కిలోమీటర్లు, 45 నిమిషాల పాటు లాంచీలో ప్రయాణించాల్సి ఉంటుంది. కనీసం 30 మంది ప్రయాణికులు ఉన్నప్పుడే లాంచీ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. కట్టడాల సంరక్షణ, మెరుగైన పర్యాటక సౌకర్యాలు, రాత్రి బస వసతులు, మాచర్ల నుంచి విజయపురి సౌత్ వరకు బస్సు సేవలు, సీప్లేన్ వంటి ఆధునిక రవాణా సదుపాయాలు కల్పిస్తే నాగార్జునకొండ అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!