

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణించకూడదని, దానికి నిధులు సమకూర్చడం, నియామకాలు చేపట్టడం, యువతను రాడికలైజ్ చేయడం, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించే, ఉగ్రవాదులకు ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలువురు ప్రపంచ నేతలు పాల్గొన్న సదస్సులో చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభాన్ని ప్రస్తావించిన మోదీ ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతుందని అన్నారు.
ప్రపంచంలోని వివిధ సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని మరోసారి పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!