

రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగిన పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 66 మంది ప్రముఖులు పద్మ పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యం, విద్యా రంగాల్లో విశిష్ట సేవలందించిన మలయాళ పాత్రికేయుడు పి. నారాయణన్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అవార్డులు స్వీకరించారు. క్యాన్సర్ చికిత్స రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
సినీ నటుడు మమ్ముట్టి, గాయని అల్కా యాజ్ఞిక్, మాజీ టెన్నిస్ స్టార్ విజయ్ అమృత్రాజ్, సామాజిక నేత వెల్లప్పల్లి నటేశన్ తదితరులు పద్మభూషణ్ అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన మాగంటి మురళీ మోహన్, గద్దె రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించబడ్డారు. శాస్త్రవేత్తలు కుమారస్వామి తంగరాజ్, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ వంటి పలువురు ప్రముఖులు కూడా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!