

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా.. ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న జిల్లాలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలై నెలలో రంగారెడ్డి జిల్లాలో రూ.35,118.87 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. దీంతో దేశంలోని జిల్లాల వారీ యూపీఐ లావాదేవీల్లో రంగారెడ్డి నాలుగో స్థానంలో నిలిచింది. రూ.96,153.36 కోట్ల లావాదేవీలతో బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.61,755.96 కోట్లతో ముంబై సబ్అర్బన్, రూ.51,264.87 కోట్లతో పుణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
రంగారెడ్డి తర్వాత చెన్నై, మేడ్చల్-మల్కాజ్గిరి, థానే, హైదరాబాద్ జిల్లాలు నిలిచాయి. మరోవైపు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పే వినియోగంలోనూ రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. గత త్రైమాసికంలో ఒక్క ఫోన్పే ద్వారానే జిల్లాలో రూ.1.04 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఫోన్పే లావాదేవీల్లో రంగారెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఐటీ-ఫార్మా వంటి రంగాల విస్తరణ, వ్యాపార కార్యకలాపాలు డిజిటల్ చెల్లింపుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!