

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణరావు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనా శిక్షణ పొందారు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమైన ఆయన ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో నటించారు. రజనీకాంత్, చిరంజీవిలకు ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించిన జీవీ నారాయణరావు ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!