

దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. బచావత్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్కు 17.1 టీఎంసీల నీటిని కేటాయించగా, అందులో 15.9 టీఎంసీలు తెలంగాణకు చెందుతున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రం సగటున 5 టీఎంసీల నీటినే వినియోగించుకోగలుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో అధిక వినియోగం, కాలువల దెబ్బతినడం, అనధికార నీటి మళ్లింపులు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
కర్ణాటకతో చర్చలు జరిపి ఆధునికీకరణ పనులను పూర్తి చేయడంతో పాటు తెలంగాణకు కేటాయించిన పూర్తి నీటి వాటాను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004లో ప్రారంభమైన ఆధునికీకరణ ప్రతిపాదనలు అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు పనుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆర్డీఎస్ ద్వారా సాగునీటి స్థిరీకరణ, రైతులకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!