

రక్షాబంధన్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. రెండున్నరేళ్లుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడు జితేంద్ర సింగ్ గంగ్వార్ (40) పరిస్థితిని చూసి తట్టుకోలేక బీనా కుమారి గంగ్వార్ (45) తన కిడ్నీని దానం చేశారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చిన జితేంద్రకు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించడంతో బీనా కుమారి ముందుకు వచ్చారు.
గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జితేంద్రకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ అనంతరం తన అక్క గురించి జితేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్ సమయంలో తన పిల్లల బాధ్యతలను కూడా బీనా కుమారే చూసుకున్నారని, ఇప్పుడు తనకు కొత్త జీవితాన్ని అందించారని తెలిపారు. తన అక్క చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
తమ్ముడికి కిడ్నీ దానం చేయడంపై బీనా కుమారి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం కష్టంగా అనిపించలేదని చెప్పారు. తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, కిడ్నీ దానం చేయడం తనకు త్యాగంగా అనిపించలేదని తెలిపారు. అక్కగా తన ప్రేమ, బాధ్యతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!