

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. విజయవాడ నుంచి చీరాల బీచ్కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏటుకూరు బైపాస్ వద్ద ముందుగా వెళ్తున్న ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్ సరుకుల లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కారు అదుపుతప్పి లారీతో పాటు డివైడర్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అఫీఫా వెనుక సీట్లో ఉండగా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో కారు డ్రైవర్ అవినాష్తో పాటు సుధీర్, వంశీ, రుత్విక్ గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ షిరీన్ బేగం ఆస్పత్రికి చేరుకుని కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకుని అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఫీఫా మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేసి, షిరీన్ బేగం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!