

గత కొన్ని రోజులుగా నటి త్రిష పేరు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా త్రిషను ఉద్దేశించినవేనన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిష ఎవరినీ నేరుగా ప్రస్తావించకుండా ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్రిప్టిక్ పోస్టులు షేర్ చేశారు. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలతో పాటు.. నాటకీయత, డబ్బు సంపాదించడం, ప్రశాంతతను వెతుక్కోవడం, ఒకప్పుడు కోరుకున్న జీవితాన్ని ఇప్పుడు పొందడం వంటి అంశాలపై సందేశాలను పంచుకున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే త్రిష షేర్ చేసిన ఇన్స్టా స్టోరీలు 24 గంటలు పూర్తికాకముందే కనిపించకుండా పోవడంతో ఆమె స్వయంగా వాటిని డిలీట్ చేశారా అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘త్రిషను ఎప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో పోస్టర్లు ఏర్పాటు చేసి వ్యాఖ్యలను నిరసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!