

పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా కొనసాగిస్తున్న సైనిక ఘర్షణ ఆ దేశానికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ‘ఇరాన్పై అమెరికా సైనిక చర్యల ఖర్చు అంచనా’ పేరుతో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 ఆగస్టు నాటికి అమెరికా రక్షణ శాఖ ఈ యుద్ధానికి సుమారు 38 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
యుద్ధంలో వినియోగించిన లేదా దెబ్బతిన్న మందుగుండు సామగ్రి, ఆయుధాలను తిరిగి సమకూర్చడం, యుద్ధ విమానాల మోహరింపు, ఇంధనం, రవాణా, నిర్వహణ వంటి ఖర్చులు ఇందులో ఉన్నాయి. ఒక విభాగానికి కేటాయించిన వనరులను మరో అవసరానికి మళ్లించడం వల్ల కలిగే నష్టం, సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల, దౌత్యపరమైన చర్యలు, విదేశీ సాయం వంటి అదనపు వ్యయాలను కూడా సీబీవో పరిగణనలోకి తీసుకుంది.
మే, జూన్ నెలల్లో కనిపించిన స్థాయిలో ఘర్షణలు మళ్లీ తీవ్రతరం అయితే అమెరికా నెలవారీ యుద్ధ వ్యయం మరో 2 బిలియన్ డాలర్లు పెరగవచ్చని సీబీవో అంచనా వేసింది. జులై నాటి తీవ్రతకు ఘర్షణలు చేరితే నెలవారీ ఖర్చు 3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఘర్షణలు మరింత తీవ్రతరం లేదా దీర్ఘకాలం కొనసాగితే వ్యయం ఇంకా పెరగవచ్చని హెచ్చరించింది. మరోవైపు, క్షిపణి రక్షణ వ్యవస్థల వినియోగం పెరగడంతో అమెరికా మిస్సైల్ నిల్వలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా చమురు, సహజవాయువు రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో ప్రపంచ ఇంధన ధరలపై కూడా ప్రభావం పడుతున్నట్లు తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!