

ఎండలు, కారంగా ఉండే ఆహారం, డీహైడ్రేషన్, అధిక కాఫీ లేదా మద్యం సేవించడం, కొన్ని మందులు లేదా ఆరోగ్య సమస్యల కారణంగా శరీరంలో వేడి పెరగవచ్చు. ఇలాంటి సమయంలో చాలామంది కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగను తీసుకుంటారు. అయితే హైదరాబాద్ యశోద ఆస్పత్రుల సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. శేషి కిరణ్ ప్రకారం రెండూ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ వాటి ఉపయోగాలు వేర్వేరుగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, సహజ ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాయామం తర్వాత, ఎండలో ఎక్కువసేపు తిరిగిన తర్వాత లేదా డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తక్షణ హైడ్రేషన్, శక్తిని అందిస్తాయి.
మజ్జిగలో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, సహజ సోడియం ఉండటంతో భోజనం చేసిన తర్వాత తాగితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపులో మంట తగ్గి శరీరానికి చల్లదనం కలుగుతుంది. శరీరంలో వేడి తగ్గించుకోవాలంటే అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లు, మజ్జిగ రెండింటినీ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పుచ్చకాయ, కీరదోస, కర్బూజ, సొరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, టీ, కాఫీ, ఆల్కహాల్, శీతల పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: కొబ్బరి నీళ్లు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే శరీర పరిస్థితి, అవసరాన్ని బట్టి ఏది తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!