

ప్రస్తుతం సరైన విజయాన్ని అందుకోవాలనే ఎదురుచూపుల్లో ఉన్న జాన్వీ కపూర్, శ్రీలీలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వరుస విజయాలు దక్కకపోవడం ఇద్దరికీ ఇబ్బందికరంగా మారింది. ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలు ఆమెకు నిరాశ కలిగించగా, శ్రీలీలకు ‘భగవంత్ కేసరి’ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మరో విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ ఇద్దరినీ కలిపి ఓ క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
‘పగలైట్’ ఫేమ్ ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిపై పెంచుకునే ప్రేమ, మమకారం, అబ్సెషన్ చుట్టూ కథ సాగనుందని, అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. చాలాకాలంగా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలని చూస్తున్న శ్రీలీలకు ఈ సినిమా మంచి అవకాశంగా మారనుంది. ప్రస్తుతం ‘లగ్ లగ్ గలే’లో నటిస్తున్న జాన్వీ కపూర్కూ ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. మంచి కథల కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!