

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైకాపా రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి భాస్కరరెడ్డితో మాజీ సీఎం, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన ఫోన్ సంభాషణ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి చెన్నారెడ్డి మాచర్ల నుంచి రెంటాలకు ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు వాహనాలతో వెంబడించి ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయనను గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని రహదారి పక్కన ఉన్న పొలాల్లో పడేసి పరారైనట్లు పేర్కొన్నారు.
చెన్నారెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చేరుకోగా.. అక్కడున్న వైకాపా నాయకులు వారిని నిలదీశారు. పిన్నెల్లి సోదరుల వర్గపోరే చెన్నారెడ్డి హత్యకు కారణమని మృతుడి మామ రంగారెడ్డి ఆరోపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. భాస్కరరెడ్డిని వైఎస్ జగన్తో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి.. “మనోళ్లే చంపేశారు.. బయటోళ్లు కాదు.. వేరే పార్టీ వాళ్లు కాదు” అని పలుమార్లు చెప్పినట్లు సంభాషణలో వినిపించింది. దీనిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చివర్లో “సారీ అన్నా” అని చెప్పి సంభాషణను ముగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!