

భారత క్రికెట్కు సంబంధించిన కీలక సమావేశానికి వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా హాజరయ్యారు. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గైర్హాజరు కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంబైకి దూరంగా, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతంలో ఉండటం వల్లే ఆయన సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు సమాచారం. మరోవైపు వీవీఎస్ లక్ష్మణ్కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ తరహా కొత్త బాధ్యతలు అప్పగించనున్నారన్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అలాగే అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో తక్షణ మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రస్తుత సెలెక్షన్ కమిటీ పనితీరుపై బోర్డుకు ఎలాంటి అసంతృప్తి లేదని, అదే కమిటీ కొనసాగుతుందని దేవజిత్ సైకియా తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో లార్డ్స్లో 138 పరుగులతో మెరిసిన రోహిత్ శర్మ ఫామ్ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని పేర్కొంటూ, అతడి స్థానం ప్రస్తుతం ఎలాంటి ప్రమాదంలో లేదని స్పష్టం చేశారు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు ఉండే అవకాశాలపై బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!