

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. వర్షం కారణంగా రెండో రోజు తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత భారత బ్యాటర్లు వేగంగా పరుగులు సాధిస్తూ భారీ స్కోరు దిశగా సాగారు. రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులతో కీలక పాత్ర పోషించారు. జురెల్ కేవలం 68 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో అర్ధ శతకం పూర్తి చేశాడు. అయితే వెంటనే ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయ డిసిల్వా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.
శ్రీలంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు, అరంగేట్ర స్పిన్నర్ కేశర నువంత మూడు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా 13 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ ఉపయోగకరమైన పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి కుల్దీప్ యాదవ్ 12, ప్రసిద్ధ్ కృష్ణ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!