

జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 19-0 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఏడో నిమిషంలో పూజా సాహూ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే వరుసగా గోల్స్ సాధించారు. 23వ నిమిషంలో మనే మరో గోల్ చేయగా, తనూజ, పూజా మాలిక్, పూర్ణిమా యాదవ్ కూడా గోల్స్ కొట్టారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 10-0తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలోనూ భారత జట్టు అదే దూకుడును కొనసాగించింది. పూజా మాలిక్ హ్యాట్రిక్ గోల్స్తో మెరవగా, సుప్రియా రెండుసార్లు గోల్ సాధించింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్, రోషిణి కూడా చక్కటి ఆటతీరుతో పాకిస్థాన్పై ఒత్తిడి పెంచారు. చివరి నిమిషంలో రోషిణి మరో గోల్ చేయడంతో భారత్ 19-0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ సెమీఫైనల్కు చేరుకుంది. సౌత్ కొరియా-మలేషియా మధ్య జరిగే క్వార్టర్ఫైనల్ విజేతతో భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. అంతకుముందు గ్రూప్ దశలో జపాన్, మలేషియా, సౌత్ కొరియాలను ఓడించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!