

పసిడి ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారుల గిరాకీ వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో వెండి ఆభరణాల హాల్మార్కింగ్ పరీక్షల సదుపాయాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సిద్ధమవుతోంది. రాబోయే రెండేళ్లలో వెండికి సంబంధించిన రెఫరల్, అసెయ్ ప్రయోగశాలల సంఖ్యను పెంచనున్నట్లు బీఐఎస్ సీనియర్ అధికారి తెలిపారు. భారత్లో వెండికి హాల్మార్కింగ్ 2005 నుంచి స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబరు నుంచి హాల్మార్క్ చేసిన వెండి వస్తువులపై హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) నంబరును ముద్రిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు వెండి స్వచ్ఛతను ధ్రువీకరించుకునే అవకాశం కలుగుతోంది.
వెండి ఆభరణాలకు హెచ్యూఐడీ ప్రవేశపెట్టిన తర్వాత గిరాకీ పెరుగుతోందని బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ప్రయోగశాలలు) నిషాత్ ఎస్. హక్ తెలిపారు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయోగశాలల్లో వెండి ఆభరణాల పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం 2024-25లో హాల్మార్క్ చేసిన వెండి ఆభరణాల సంఖ్య 32 లక్షలు కాగా.. 2025-26లో అది 59 లక్షలకు పెరిగింది. వచ్చే రెండేళ్ల అవసరాలను బీఐఎస్ సొంత ప్రయోగశాలలు తీర్చగలవని, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రెఫరల్, అసెయ్ ల్యాబొరేటరీలను విస్తరిస్తామని ఆమె వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!