

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (ఇంటర్గ్లోబ్ ఏవియేషన్) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.238 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు, విమాన ఇంధన ధరల పెరుగుదల, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు నష్టానికి కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇండిగో రూ.2,176.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.21,542.60 కోట్ల నుంచి రూ.25,614.21 కోట్లకు పెరిగినప్పటికీ, వ్యయాలు 34 శాతం పెరిగి రూ.25,852.50 కోట్లకు చేరాయి. ఇంధన వ్యయాలు 86 శాతం పెరిగి రూ.10,832.90 కోట్లుగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి ఇండిగో వద్ద 432 విమానాలు ఉండగా, నగదు నిల్వలు రూ.52,884.60 కోట్లుగా ఉన్నాయి.
జులై–సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ఇండిగో తెలిపింది. గత డిసెంబర్లో భారీగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై సీసీఐ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇండిగో సంక్షోభ నిర్వహణ బృందం ఏర్పాటు, ప్రయాణికుల సహాయ కేంద్రాలు, అత్యవసర సమయంలో ఉచిత రీబుకింగ్, టికెట్ ధరల పరిమితి, ప్రత్యామ్నాయ విమాన సౌకర్యాలు వంటి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని సీసీఐ ఆమోదిస్తే జరిమానా లేకుండానే విచారణ ముగిసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!