

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో భారత శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ రంగంలో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ప్రయోగించాలన్న జియో ప్రతిపాదనకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ (IN-SPACe) సాంకేతిక ఆమోదం తెలిపింది. ఇస్రో, టెలికాం శాఖ డబ్ల్యూపీసీ విభాగాల సమగ్ర పరిశీలన అనంతరం ఈ ప్రాజెక్ట్కు అనుమతి లభించింది.
ఈ సాంకేతిక అనుమతితో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) వద్ద ఆర్బిటల్ స్లాట్లు, స్పెక్ట్రమ్ హక్కులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం జియోకు విధానపరమైన మద్దతు అందించనుంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే భారతదేశపు తొలి స్వదేశీ శాటిలైట్ కాన్స్టలేషన్ ఏర్పాటు కానుంది. దీని సామర్థ్యాన్ని ప్రపంచ ప్రఖ్యాత స్టార్లింక్ సేవలతో పోలుస్తున్నారు.
జియో నెట్వర్క్ ద్వారా సెకనుకు 4.5 నుంచి 5 టెరాబిట్ల డేటా సామర్థ్యం అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా 20 నుంచి 22 గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటు డైరెక్ట్ టు డివైస్ (D2D) సేవలను అందించనుంది. జాతీయ భద్రత, రక్షణ అవసరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!