

భారత విమానయాన రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ఎయిర్పోర్టులను నిర్వహిస్తున్న సంస్థలు విమానయాన సేవలను నిర్వహించడంపై ఉన్న పరిమితులను సడలించే ప్రతిపాదనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే అదానీ గ్రూప్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వంటి ప్రధాన ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు భవిష్యత్తులో సొంతంగా ఎయిర్లైన్ సేవలను ప్రారంభించే అవకాశం పొందుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఏదైనా ఎయిర్లైన్లో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండలేరు.
ఈ మార్పు అమల్లోకి వస్తే భారత విమానయాన రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు దాదాపు 90 శాతం వాటాను నియంత్రిస్తున్నాయి. గత కొన్నేళ్లలో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిచిపోగా, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా టాటా గ్రూప్లో విలీనమయ్యాయి. అయితే, ఎయిర్పోర్ట్ నిర్వహణతో పాటు ఎయిర్లైన్ సేవలను ఒకే సంస్థ నిర్వహించడం వల్ల స్లాట్ల కేటాయింపులో పక్షపాతం జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2047 నాటికి దేశంలో 350 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!