

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల రమాబాయి రణ్వీర్ తన పట్టుదలతో అందరి మనసులు గెలుచుకున్నారు. సాధారణ చీర, మామూలు స్లిప్పర్లతోనే మారథాన్లో పాల్గొని ఏకంగా విజేతగా నిలిచారు. అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఓ విద్యా ప్రాంగణంలో ‘అమృత్ దౌడ్’ పేరుతో నిర్వహించిన మారథాన్లో ఆమె పాల్గొన్నారు. స్పోర్ట్స్ దుస్తులు, షూలతో వచ్చిన యువత మధ్య ఆమె సాధారణ వస్త్రధారణతోనే బరిలోకి దిగారు.
కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన రమాబాయి.. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం వంటమనిషిగా పనిచేస్తున్నారు. మారథాన్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె స్లిప్పర్లు తెగిపోయాయి. అయినప్పటికీ ఆమె పరుగు ఆపలేదు. తెగిన చెప్పులను చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. రాళ్లు గుచ్చుకున్నా, పరుగు సమయంలో చీర ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గలేదు. చివరకు మిగతా పోటీదారులను అధిగమించి మారథాన్లో విజయం సాధించి రూ.3,000 నగదు బహుమతిని అందుకున్నారు. ఈ మొత్తాన్ని తన కుమార్తె ఫీజు కోసం ఉపయోగిస్తానని రమాబాయి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చూపిన పట్టుదల, మాతృప్రేమ పలువురికి స్ఫూర్తిగా నిలిచాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!