

రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతికత, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అమరావతిలో 8.5 ఎకరాల్లో రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో సమకూర్చనుంది.
శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేలోపు వచ్చే నెల నుంచే గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక తరగతులు ప్రారంభించనున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఏఐ-మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందించనున్నారు. అమరావతి క్యాంపస్లో 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటమ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ బ్లాక్ను ఏర్పాటు చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!