

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15న షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందులో ఖాళీల వివరాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి అంశాలను వెల్లడించనుంది. సిలబస్, రిజర్వేషన్ రోస్టర్, ఇతర నియామక మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. జులై 1 నాటికి ఉన్న వయసును అర్హతకు ప్రాతిపదికగా తీసుకోనున్నారు. కొత్తగా విద్యార్హతలు పూర్తి చేసిన అభ్యర్థులు వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదనపు అర్హతలు సాధించినవారు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్-1 పోస్టుల జాబితాలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియామక ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సమస్యలు దాదాపు పరిష్కారమైనట్లు తెలుస్తోంది.
సవరించిన గ్రూప్-1 జాబితాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ గతంలో అనుమతించిన 149 పోస్టులకు అదనంగా వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్/ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాధికారి తదితర పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఎంపీడీవో పోస్టును జాబితా నుంచి తొలగించగా, జిల్లా పంచాయతీ అధికారి స్థానంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టును చేర్చారు. అలాగే డివిజనల్ ఫైర్ ఆఫీసర్ స్థానంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ పోస్టును మార్చారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్ పోస్టులుగా మార్చారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను మాన్యువల్గా నిర్వహించి, మిగతా నియామక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించే దిశగా ఏపీపీఎస్సీ ఆలోచిస్తోంది. ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ విధానంపై నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!