

రాబోయే రెండు ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచాలని ఎస్బీఐ రిసెర్చ్ సూచించింది. అక్టోబర్లో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్లో మరో 25 బేసిస్ పాయింట్లు చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్ల పెంపు అవసరమని పేర్కొంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను నియంత్రించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఎస్బీఐ రిసెర్చ్ పేర్కొంది. భారత్ తన ఇంధన అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు క్రమంగా వడ్డీరేట్లను పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆగస్టు ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. తదుపరి సమీక్ష అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!