

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అనుమానాస్పద, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3,718 మొబైల్ అప్లికేషన్లను దేశంలో బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ లోక్సభకు వెల్లడించింది. 2026 జూన్ 30 నాటికి అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS)కు అందిన 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి, సుమారు రూ.11,158 కోట్లను సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు చోరీ చేసిన డబ్బును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంకు ఖాతాలపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జూన్ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్ ఖాతాలను గుర్తించి, వాటి ద్వారా జరగాల్సిన రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నట్లు తెలిపింది. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత యాప్లు, సోషల్ మీడియా నేరాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రజల్లో అవగాహన కోసం ఎస్ఎంఎస్లు, టీవీ, రేడియో, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!