

మార్కాపురం ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశ సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు.
కృష్ణా జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో మార్కాపురం ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం నిర్వహించిన జలహారతి కార్యక్రమాన్ని సభా ప్రాంగణం నుంచి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గిరిజన మహిళలు చంద్రబాబుకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేశారు. దీంతో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!