

ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగం విస్తృతంగా పెరిగింది. కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా ఫోన్ మార్చడం, ఏడాదికోసారి కొత్త ఫోన్ కొనడం చాలామందికి సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో కొందరు వ్యక్తులు పాత ఫోన్లకు నగదు లేదా ప్లాస్టిక్ సామగ్రి ఇస్తామంటూ వీధుల్లో తిరుగుతున్నారు. అయితే ఇలాంటి వారికి పాత ఫోన్లను ఎలాంటి వివరాలు తీసుకోకుండా విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలా సేకరించిన ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి చేరే అవకాశం ఉందని, వాటిని మరమ్మతు చేసి ఇతర SIM కార్డులతో సైబర్ మోసాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్లో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, బ్యాంకింగ్కు సంబంధించిన సమాచారం వంటి డేటా మిగిలి ఉంటే దాన్ని నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
పాత ఫోన్ను విక్రయించే ముందు SIM కార్డును తొలగించడం, అవసరమైన డేటాను బ్యాకప్ చేసుకోవడం, అన్ని వ్యక్తిగత ఖాతాలను తొలగించి ఫోన్ను సురక్షితంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గుర్తుతెలియని వ్యక్తులకు నేరుగా ఫోన్ విక్రయించకుండా.. డీలర్ లేదా కొనుగోలుదారుడి వివరాలను నమోదు చేసుకోవడం మంచిది. ఫోన్ విక్రయించిన తేదీ, IMEI నంబర్, కొనుగోలుదారుడి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మొబైల్కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుంది. భవిష్యత్తులో ఆ ఫోన్ ఏదైనా నేరంలో ఉపయోగించినట్లయితే.. విక్రయించిన తేదీ, కొనుగోలుదారు వివరాలు ఉన్న రసీదు ద్వారా ఫోన్ అప్పటికే తమ వద్ద లేదని నిరూపించుకోవడానికి సహాయపడుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!