

కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 15న సాయంత్రం 6.35 గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో తొమ్మిది రోజుల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మాడ వీధులు, ఆలయ గోపురం, తిరుమల పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్యాలరీలు, హారతి క్యూ పాయింట్లు, మరుగుదొడ్లు, జర్మన్ షెడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు ధ్వజారోహణానికి ఉపయోగించే పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన చాప, తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో సేకరించిన విష్ణు దర్భతో వీటిని తయారు చేయడం ఆనవాయితీ. అటవీశాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి చాప, తాడును తిరుమలకు తీసుకువచ్చి రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. ధ్వజారోహణ సమయంలో రుత్వికులు వేద మంత్రాల మధ్య దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టి, గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్, విజిలెన్స్ శాఖలకు చెందిన 6,300 మంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!