

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులతో పాటు పవిత్ర శ్రావణమాసం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు నిర్ణయం మేరకు శుక్రవారం నుంచి సోమవారం వరకు ఉదయం స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. అయితే ప్రోటోకాల్ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు పరిస్థితిని బట్టి రాత్రి 8.30 గంటల సమయంలో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.
అదే విధంగా ఈ నాలుగు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం భక్తులకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. దీంతో ఆలయంలోని అన్ని క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల క్యూ దేవస్థానం ఆసుపత్రిని దాటి మల్లికార్జున సదన్ వైపు వరకు విస్తరించింది. స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సంయుక్తంగా తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!