

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది. రైతుల భూములను పరిహారం చెల్లించకుండా తీసుకుంటున్నారంటూ చోడిశెట్టి నిర్మలత దాఖలు చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న అనుబంధ పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన వారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి వరకు భూమిపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులను కొనసాగించింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని తన 65 సెంట్ల భూమిని ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మలత హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ ప్రక్రియ 2013 భూసేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగాలని ధర్మాసనం పేర్కొంది. ఆస్తి హక్కు భూమి విస్తీర్ణంపై ఆధారపడదని, చిన్న భాగం సేకరించినా చట్టపరమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యత అవసరమని హైకోర్టు పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!